International
-Bomma Shivakumar
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనం మధ్య ఇరాన్ తో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని మంగళవారం హింట్ ఇచ్చారు. న్యూయార్క్ పోస్ట్ తో మాట్లాడిన ట్రంప్, రాబోయే రెండు రోజుల్లో ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ అధికారులు సమావేశం కావొచ్చని స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్ లోని హోటల్ సెరీనాలో ఏప్రిల్ 11న జరిగిన మొదటి రౌండ్ చర్చలను ప్రస్తావిస్తూ ట్రంప్.. “మీరు అక్కడే ఉండాలి, నిజంగా, ఎందుకంటే వచ్చే రెండు రోజుల్లో ఏదైనా జరగవచ్చు. మేము అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాము” అని అన్నారు.
రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తరువాత, ఏప్రిల్ 11న ఇరాన్, యూఎస్ ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్లో సమావేశమయ్యాయి. అయినప్పటికీ, ఈ చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. చర్చల వైఫల్యానికి రెండు దేశాలు ఒకదాన్నొకటి తీవ్రంగా నిందించుకున్నాయి.
రెండో రౌండ్ చర్చల అవకాశాన్ని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో ట్రంప్ ముడిపెట్టినట్లు కనిపించింది. “ఫీల్డ్ మార్షల్ అద్భుతంగా పని చేస్తున్నారు కాబట్టి, మేము అక్కడికి తిరిగి వెళ్లే అవకాశం ఎక్కువ” అని ఆయన ఆ అమెరికన్ మీడియాకు తెలిపారు.

అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దీనికి ప్రతిగా టెహ్రాన్ ప్రాంతీయ దాడులకు దిగుతామని హెచ్చరించింది. పాకిస్థాన్ ఇరుపక్షాలను తిరిగి చర్చలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గత వారం కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) కొనసాగినప్పటికీ, హార్మూజ్ జలసంధి వివాదం శత్రుత్వాలను మళ్లీ రగిలించింది. ప్రాంతీయ యుద్ధ ఆర్థిక పతనాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది.
మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ట్రంప్ సంభాషణ జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు సంబంధించి చర్చించారు. ఇక అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఇదే విషయంపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్టు పెట్టారు.

