ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. EPFO ప్రకారం.. పాత ఫారమ్లు 15G, 15H స్థానంలో కొత్తగా ఫారం 121ను ప్రవేశపెట్టనుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు 60 సంవత్సరాల లోపు వారు ఫారం 15G, సీనియర్ సిటిజన్లు ఫారం 15H సమర్పించేవారు. అయితే ఇకపై ఈ రెండింటి స్థానంలో ఒకే ఫారం 121ను ఉపయోగించాల్సి ఉంటుంది. పన్ను బాధ్యత సున్నాగా ఉన్నవారు, అంటే తమ ఆదాయం పన్ను పరిమితికి దిగువన ఉన్నవారు, టీడీఎస్ (TDS) కోతలను నివారించేందుకు ఈ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది.
ఫారం 121ను భారతదేశంలో నివసించే వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUF), ఇతర అర్హులైన వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు. అయితే కంపెనీలు, సంస్థలు, అలాగే ఎన్నారైలకు ఈ ఫారం వర్తించదు. మొత్తం అంచనా ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోవడం ఈ ఫారం సమర్పించడానికి ప్రధాన షరతుగా ఉంటుంది. ఫారం 121 ఒక స్వీయ-ప్రకటన పత్రంగా పనిచేస్తుంది. దీన్ని EPFO, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలకు సమర్పించినట్లయితే, టీడీఎస్ కోతలు జరగవు. ప్రతి ఫారానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN) కూడా ఇవ్వబడుతుంది. ఈ సంఖ్యలో క్రమ సంఖ్య, పన్ను సంవత్సరం, TAN వంటి వివరాలు ఉంటాయి.
ఇక పాత ఫారమ్ల విషయానికి వస్తే ఏప్రిల్ 1 తర్వాత కూడా 15G లేదా 15H సమర్పించినా అవి వెంటనే తిరస్కరించబడవు. అయితే తర్వాత ఫారం 121 సమర్పించాలని కోరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొత్త ఫారం 121ను మరింత సులభతరం చేసే విధంగా రూపకల్పన చేశారు. ఇందులో ఆటో-ఫిల్ సమాచారం, రియల్-టైమ్ ఎర్రర్ చెక్, డ్రాప్డౌన్ ఎంపికలు, సులభమైన ధృవీకరణ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఫైలింగ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పొరపాట్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

