Chandrababu Tamil Nadu Elections,అమరావతిలో 5 వేల ఎకరాల్లో ఎయిర్పోర్టు.. కోయంబత్తూరులో మాత్రం 500 ఎకరాలే: చంద్రబాబు – chandrababu comparison between amravati and coimbatore airports in tamil nadu election campaign
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరులో పర్యటించిన చంద్రబాబు.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదే క్రమంలో విమానాశ్రయాల ప్రస్తావన తీసుకువచ్చారు. అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మిస్తున్నామన్న చంద్రబాబు.. కోయంబత్తూరులో మాత్రం 500 ఎకరాల్లో చాలనుకున్నారని అన్నారు. విమానాశ్రయాల ద్వారా జీఎస్డీపీ పెరగటంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
హైలైట్:
తమిళనాడులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
కోయంబత్తూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం
అమరావతి, కోయంబత్తూరు విమానాశ్రయాల పోలిక
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరుఫున చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. కష్టపడే తత్వం, తెలివితేటలే తమిళ ప్రజల విజయరహస్యమని అన్నారు. తమిళులలాగా మాతృ భాషను ప్రేమించేవారు లేరని కొనియాడారు. తమిళ ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయన్న చంద్రబాబు.. మన భాష ఏదైనా కూడా మనమంతా ద్రవిడులమని అన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ మంచి స్నేహితులని.. ఇద్దరూ కలిసి తెలుగుగంగ ద్వారా తమిళనాడుకు నీటిని తెచ్చారని గుర్తు చేశారు.తన వివాహం కూడా చెన్నైలోనే జరిగిందన్న చంద్రబాబు.. తమ ప్రాంతమైన చిత్తూరు, తిరుపతి చుట్టుపక్కల తమిళమే మాట్లాడతారని అన్నారు. ఈ ఎన్నికల్లో తమిళుల ప్రయోజనాలను కాపాడేవారిని గెలిపించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని డీఎమ్కే, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు ద్రోహం చేశాయని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ ఎజెండాతోనే బిల్లును అడ్డుకున్నారని.. ప్రతీ మహిళా దీనిపై ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని 2500 ఎకరాలలో నిర్మించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు మళ్లీ అమరావతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని.. అయితే కోయంబత్తూరు ఎయిర్పోర్టు కేవలం 500 ఎకరాల్లోనే ఉందని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్, బెంగళూరు వంటిచోట్ల ఇప్పటికే విమానాశ్రయాలు ఉన్నాయన్న చంద్రబాబు.. అయినప్పటికీ మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారన్నారు. తమిళనాడులో మాత్రం విమానాశ్రయాలపై పెద్ద శ్రద్ధ చూపడం లేదని.. ఎయిర్పోర్టుల ద్వారా జీఎస్డీపీ పెరుగుతుందని.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చంద్రబాబు వివరించారు. అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.
మరోవైపు మంగళవారం కూడా చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని తమిళ ప్రజలను కోరనున్నారు. ఇక విజయ్ టీవీకే పార్టీపై స్పందించడానికి చంద్రబాబు నిరాకరించారు. ఎన్నికల్లో తెలుస్తుందంటూ తన సమాధానం దాటవేశారు.
రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి