యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం మత్తులో జరిగిన ఘోరం మిత్రుడి ప్రాణాన్ని బలిగొన్న తీరు కలచివేస్తోంది. కేవలం బాటిల్లో మిగిలిన లాస్ట్ లక్కీ డ్రాప్స్ కోసం మొదలైన చిన్నపాటి వివాదం ఒకరిని ‘లాస్ట్ లైఫ్’ దిశగా నెట్టింది.
బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రాగీర్ మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్ అనే ముగ్గురు స్నేహితులు ఏప్రిల్ 21వ తేదీ (మంగళవారం) రాత్రి శామీర్పేట వాగు సమీపంలోని ఒక వెంచర్లో మద్యం తాగడానికి కూర్చున్నారు. రాత్రంతా కలిసి నాలుగు ఫుల్ బాటిళ్లను ఖాళీ చేశారు. చివరి చుక్కతో మొదలైన గొడవ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది.
మద్యం బాటిళ్లలో మిగిలిన చివరి చుక్కలను (లక్కీ డ్రాప్స్) తనకు పోయకుండా చరణ్, నవీన్ తాగేశారనే ఆగ్రహంతో మధు వారిపై గొడవకు దిగాడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన మధు వారిపై దాడి చేయగా, ప్రతిగా చరణ్, నవీన్లు ఇనుప రాడ్తో మధు తలపై బలంగా కొట్టారు. దీంతో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం భయాందోళనకు గురైన నిందితులు మృతదేహాన్ని వాగు పక్కన ఉన్న కంపచెట్ల పొదల్లో పడేశారు. మూడు రోజుల పాటు ఏమీ ఎరగనట్టు నటించాడు.
అయితే మిత్రుడి మరణంతో చరణ్, నవీన్లు మనస్తాపానికి గురయ్యారు. చేసి తప్పు తెలుసుకుని, శుక్రవారం (ఏప్రిల్ 25) నేరుగా స్టేషన్కు వెళ్లి. పోలీసు ఎదుట లొంగిపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడితో సహా నిందితులు ముగ్గురూ గతంలో గంజాయి కేసులో కూడా నిందితులుగా ఉండటం గమనార్హం. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. మద్యం, మాదకద్రవ్యాల ప్రభావం వల్ల మనుషులు ఎంతటి క్రూరత్వానికి పాల్పడతారో ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

