అమరావతి, ఏప్రిల్ 29: రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్డేట్ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇంటర్ ఫలితాల మాదిరి ఎక్స్ వేదికగా పదో తరగతి ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్ధులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్తోపాటు టీవీ9 తెలుగు వెబ్సైట్లోనూ ఒక్క క్లిక్తో నేరుగా మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఈ పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు నెల రోజులుగా ఫలితాల కోసం విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మూల్యాంకనం తర్వాత మార్కుల ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా ముగియడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. గతేడాది ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
నేడు తెలంగాణ టెన్త్ 2026 ఫలితాలు
మరోవైపు తెలంగాణలో టెన్త్ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదలకానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు చేతుల మీదగా ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

