పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రభావంపై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విడుదల చేసిన తాజా నివేదిక భారత ఆర్థిక వ్యవస్థకు మిశ్రమ సంకేతాలను ఇస్తోంది. ఒకవైపు సరఫరా వైపు షాక్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతుండగా, మరోవైపు దేశీయ డిమాండ్, ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు బలమైన రక్షణగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా వెస్ట్ ఏసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చమురు, ఎరువుల సరఫరాను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. దీని వల్ల ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోలియం దిగుమతులపై అధికంగా ఆధారపడే భారతదేశానికి ఇది ఒక కీలక సవాలు.
ఇక వాతావరణ పరిస్థితులు కూడా మరో ప్రమాదంగా కనిపిస్తున్నాయి. El Niño ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని అంచనా. తక్కువ వర్షపాతం వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీసి, ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చు. అయితే ఈ ప్రతికూలతల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని నివేదిక చెబుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 7–7.4 శాతం వృద్ధి అంచనా వేయబడగా, 2025-26లో ఇది 7.6 శాతంగా ఉండొచ్చని అంచనా. బ్యాంకింగ్ వ్యవస్థలో మూలధన సమృద్ధి, మంచి ఆస్తి నాణ్యత, సరిపడ ద్రవ్యత వంటి అంశాలు ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టే కీలక బలాలు.
ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఎరువుల ఉత్పత్తికి గ్యాస్ సరఫరా పెంపు, కస్టమ్స్ సుంకాల మినహాయింపు, ఖరీఫ్ సీజన్కు సబ్సిడీల పెంపు వంటి నిర్ణయాలు వ్యయ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే RBI ద్రవ్యతను సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఇంకా ఒక సానుకూల అంశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు). ఇవి భారత ఎగుమతులను పెంచి, గ్లోబల్ సప్లై చైన్లో దేశ స్థానం బలోపేతం చేయగలవు. ప్రపంచ అస్థిరతను ఒక అవకాశంగా మార్చుకునే సామర్థ్యం భారత్కు ఉందని నివేదిక పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

