Virat Kohli : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహానే ఆయన కొంపముంచింది. లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ప్రిన్స్ యాదవ్, కోహ్లీ చెప్పిన చిట్కానే ఉపయోగించి ఆయన్ని డకౌట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీపై లక్నో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రిన్స్ యాదవ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “గత మ్యాచ్ తర్వాత నేను విరాట్ భయ్యాను కలిసి సలహా అడిగాను. అప్పుడు ఆయన నాతో.. ‘బంతి ఒక లెంత్ వద్ద స్వింగ్ అవుతున్నప్పుడు, దానిని మార్చకు. అదే లెంత్ను కంటిన్యూ చేయి’ అని చెప్పారు” అని ప్రిన్స్ తెలిపాడు. సరిగ్గా అదే చిట్కాను కోహ్లీ బ్యాటింగ్కు వచ్చినప్పుడు ప్రిన్స్ ప్రయోగించాడు. బంతి స్వింగ్ అవుతుండటంతో పదే పదే ఒకే లెంత్ మీద బంతులు వేసి కోహ్లీని కన్ఫ్యూజ్ చేశాడు. ఫలితంగా రెండో బంతికే కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
9 ఏళ్ల తర్వాత తొలిసారి..
ఐపీఎల్ చరిత్రలో ఛేజ్ మాస్టర్గా పేరున్న విరాట్ కోహ్లీకి ఇది ఒక చేదు జ్ఞాపకం. లక్ష్య ఛేదనలో కోహ్లీ డకౌట్ (0) అవ్వడం దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి, కోహ్లీ వికెట్ పడటంతోనే మ్యాచ్ లక్నో వైపు మలుపు తిరిగింది. ప్రిన్స్ యాదవ్ వేసిన ఆ బంతి బ్యాట్ మరియు ప్యాడ్ మధ్య నుంచి దూసుకెళ్లి వికెట్లను ఎగరగొట్టడం చూసి స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మిస్ ఫీల్డ్ నుంచి మ్యాచ్ విన్నర్ వరకు
అంతకుముందు ఇన్నింగ్స్లో మొహమ్మద్ షమీ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్ ఒక చిన్న మిస్ ఫీల్డ్ చేశాడు. కానీ ఆ వెంటనే తేరుకున్నాడు. తర్వాతి బంతికే జాకబ్ బెథెల్ క్యాచ్ పట్టి తన తప్పును సరిదిద్దుకున్నాడు. తన ఫోకస్ దెబ్బతినకుండా చూసుకున్నానని ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ప్రిన్స్ మొత్తం 3 కీలక వికెట్లు తీసి లక్నో విజయంలో హీరోగా నిలిచాడు. లక్నో ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లినా, ప్రిన్స్ యాదవ్ వంటి ప్రతిభావంతులు దొరకడం ఆ జట్టుకు పెద్ద ఊరట.
𝗣𝗿𝗶𝗻𝗰𝗲 𝗴𝗲𝘁𝘀 𝘁𝗵𝗲 𝗞𝗶𝗻𝗴 😮 \|/
🎥 An absolute peach of a delivery from the young fast bowler to rattle the stumps 💥
Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/YlxbQO9Oma
— IndianPremierLeague (@IPL) May 7, 2026
మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీ
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీ (111 పరుగులు) బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లక్నో నిర్ణీత 19 ఓవర్లలో 209/3 పరుగులు చేయగా, ఆర్సీబీ 203 పరుగులకే పరిమితమైంది. వాన దేవుడు ఆటంకం కలిగించినా, లక్నో బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి గెలుపును సొంతం చేసుకున్నారు. వరుసగా ఆరు ఓటముల తర్వాత లక్నోకు ఇది మొదటి విజయం కావడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

