టీటీడీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు జరిగాయి. టీటీడీ ఈవో శ్యామలరావు జెండా ఎగురవేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, సిబ్బంది కవాతు నిర్వహించారు. అనంతరం టీటీడీలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమల అభివృద్ధికి విజన్ -2047 తయారుచేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈ విజన్ రూపొందిస్తున్నట్లు వివరించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తున్నామని, మరింత రుచికరంగా అందించేందుకు అత్యాధునిక యంత్రాలతో అన్నప్రసాదాలు తయారు చేసేలా టివిఎస్ మోటార్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే ముడిసరుకుల ఎంపికలో సూచనల కోసం రిలయన్స్ రిటైల్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని జనతా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా దేశంలోని ప్రముఖ సంస్థలకు, క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సులు జారీ చేయనున్నట్లు చెప్పారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత రుచిగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కొనుగోలు చేస్తున్నామని.. నెయ్యి నాణ్యతను పూర్తి స్థాయిలో గుర్తించేలా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ ల్యాబ్ కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రూ.70 లక్షలు విలువ చేసే రెండు యంత్రాలను విరాళంగా ఇచ్చిందని వివరించారు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనము, వసతి వంటి సేవల బుకింగ్లో లోపాలు చక్కదిద్దేందుకు ఐటీ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు సుమారుగా 7 లక్షల మంది భక్తులకు ద్వార దర్శనాలు కల్పించామని తెలిపారు.
మరోవైపు తిరుమల అభివృద్ధికి విజన్ – 2047 తయారు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. సీఎం సూచనల మేరకు అలిపిరి బేస్ క్యాంప్, మల్టీలెవల్ పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అలాగే నూతన లింక్ రోడ్డులు, సబ్ వేల నిర్మాణం, రామ్ భగీచ, బాలాజీ బస్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు.


