మరోవైపు దుర్గ్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (20829) ఉదయం 5 గంటల 45 నిమిషాలకు దుర్గ్ జంక్షన్ నుంచి బయల్దేరనుంది. అనంతరం రాయ్పూర్ జంక్షన్, మహాసముంద్, ఖారియర్ రోడ్డు, కాంతబంజి, టిట్లాఘర్ జంక్షన్, కేసింగ, రాయగడ, విజయనగరం జంక్షన్ మీదుగా మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖపట్నం – దుర్గ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20830) తిరిగి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయల్దేరి రాత్రి పది గంటల 50 నిమిషాలకు దుర్గ్ జంక్షన్ చేరుకుంటుంది. ఇక దుర్గ్ -విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 8 స్టేషన్లలో ఆగనుంది. అలాగే 567 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో చేరుకోనుంది.
మరోవైపు ఏపీ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న అద్భుతమైన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని వందే భారత్ రైళ్లు తేవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ- బెంగళూరు, విజయవాడ- ముంబయి మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడపాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే విజయవాడ బెంగళూరు వందే భారత్ రైలు ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. అయితే విజయవాడ మంబయి మార్గంలో వందే భారత్ రైలు పగటిపూట నడపటం అసాధ్యమని అశ్వినీ వైష్ణవ్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ బెంగళూరు వందే భారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.