ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. భానుడి భగభగలకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, బయట అడుగుపెడితే నిప్పుల కుంపటిలా అనిపిస్తోంది. అటు తీవ్రమైన ఎండ, ఇటు వడగాలుల ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్లోని నాలుగు జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. ఈ వేడికి తట్టుకోలేక రోడ్లపై వెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్ వాహనాలు సైతం అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులు అప్రమత్తమయ్యారు. ఎండ తీవ్రత నుంచి బంకులను కాపాడుకోవడానికి, అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే వాహనదారులు కాసేపు సేద తీరేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామం వద్ద ఉన్న ఓ ప్రైవేట్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్ పోసే మిషన్లకు ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేశారు నిర్వహకులు. మధ్యాహ్నం పూట ఎండలు తీవ్రంగా ఉండడంతో మిషన్లు వేడెక్కుతున్నాయని, వాటిని చల్లబర్చేందుకు కూలర్లను ఏర్పాటు చేస్తే మిషన్లు పాడవకుండా ఉంటాయని ఆలోచించారు నిర్వాహకులు. అందుకే మిషన్ ప్యానల్స్ ఓపెన్ చేసి వాటి దగ్గర కూలర్స్ను ఏర్పాటు చేశారు.
ఒక్క చించోలిలోనే కాదు నిర్మల్ రూరల్ మండలం , లక్ణ్మణచందా , దిల్వార్ పూర్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ మిషన్ల వద్ద ఇలా కూలర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా కూల్ కూల్గా మిషన్లను ఉంచక పోతే పెనుప్రమాదం జరిగే అవకాశం ఉంటుందంటున్నారు బంకుల నిర్వహకులు. పెట్రోల్ కోసం వస్తున్న వాహనదారులు సైతం ఆ చల్లదనం కోసం బంకులో కాసేపు సేదతీరుతూ నిర్వహకులను అభినందిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

