Business
oi-Lingareddy Gajjala
ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల గురించి తల్లిదండ్రులకు ఉండే ఆందోళనను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని అమలు చేస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింటిలోనూ ఇది అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తూ మధ్యతరగతి కుటుంబాల పాలిట వరంగా మారింది. ఏడాదికి కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఈ ఖాతాలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం, ఒక వ్యక్తి ఏడాదికి రూ. 1.5 లక్షల చొప్పున 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే, మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది. అయితే సమ్మేళన వడ్డీ (Compounding) మహిమతో మెచ్యూరిటీ సమయానికి అంటే 21 ఏళ్లు నిండేసరికి ఆ మొత్తం ఏకంగా రూ. 71.82 లక్షలుగా మారుతుంది. ఇది మీరు పెట్టిన అసలు పెట్టుబడికి మూడు రెట్ల కంటే ఎక్కువ కావడం విశేషం.

పన్ను ప్రయోజనాలు – ఉపసంహరణ
ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణ పన్ను మినహాయింపు. ఇన్వెస్ట్ చేసే మొత్తంపైనే కాకుండా, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తంపై కూడా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య అవసరాల కోసం ఖాతాలోని నిధులను పాక్షికంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
అర్హతలు – నిబంధనలు
10 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలిక పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. గరిష్టంగా 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు చేయవచ్చు. ఒకవేళ పొరపాటున ఏడాదికి రూ. 1.5 లక్షల పరిమితికి మించి డిపాజిట్ చేస్తే, ఆ అదనపు మొత్తానికి వడ్డీ లభించదు , దానిని వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే, బాలిక భారత పౌరసత్వాన్ని కోల్పోయినా లేదా ప్రవాస భారతీయురాలు (NRI) గా మారినా వడ్డీ చెల్లింపులు నిలిపివేస్తారు.
ఖాతా తెరవడం ఎలా?
మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు శాఖలో ఈ ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు. దీని కోసం బాలిక జనన ధృవీకరణ పత్రం (Birth Certificate), తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వంటి కేవైసీ (KYC) పత్రాలు అవసరం. ఒకవేళ కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లయితే, మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి ముగ్గురి పేరు మీద కూడా ఖాతాలు తెరవవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పూర్తి భద్రత ఉండే ఈ పథకం మీ బిడ్డను రేపు ఆర్థికంగా స్వతంత్రురాలిని చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

