తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ను విలీనం చేస్తూ, రెండు విభాగాలు కలిపి ఒకే పరీక్షల బోర్డు కిందకు వచ్చేలా నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు కానుండటంతో, అతి త్వరలో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్సీ బోర్డు, ఇంటర్ బోర్డులను కలిపి ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’గా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 1971 ఇంటర్ విద్యా చట్టాన్ని రద్దు చేసి, 1982 విద్యా చట్టాన్ని సవరించనున్నారు. విలీనం తర్వాత జూనియర్ కళాశాలలు కూడా పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి. కేంద్ర విద్యాశాఖ సిఫార్సుల మేరకు ఈ ఏకీకృత విధానాన్ని అమలు చేస్తున్నారు. పదో తరగతి తర్వాత చదువు మానేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఇంటర్ వైపు మళ్లించడం సులభమవుతుంది. పాఠశాల విద్య పరిధిలోకి ఇంటర్ వస్తే సమగ్ర శిక్షా, పీఎం శ్రీ వంటి పథకాల ద్వారా కేంద్రం నుంచి భారీగా నిధులు పొందే వీలుంటుంది. స్కూళ్లు, కాలేజీలు కలిసి ఉండటం వల్ల ల్యాబ్లు, గ్రంథాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఒకే ఉపాధ్యాయులు ఇంటర్ వరకు బోధించడం వల్ల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

