Andhra Pradesh
oi-Korivi Jayakumar
ఆంధ్రప్రదేశ్ జైళ్ల పరిస్థితులపై జాతీయ నేర రికార్డుల బ్యూరో National Crime Records Bureau (NCRB) విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ వార్షిక నివేదిక-2024’ పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలకు చెల్లిస్తున్న వేతనాలు దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా సెంట్రల్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం, సిబ్బంది కొరత వంటి సమస్యలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రోజుకు రూ.160 మాత్రమే..
నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పని చేసే ఖైదీలకు రోజువారీ సగటు వేతనం కేవలం రూ.160 మాత్రమే అని సమాచారం. ఖైదీలు చేసే పనుల ఆధారంగా వారికి చెల్లింపులు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి నైపుణ్యం ఉన్న ఖైదీలకు రోజుకు ₹200, కొంతమేర నైపుణ్యం ఉన్న వారికి ₹180 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఖైదీలకు రోజుకు సగటున ₹524 చెల్లిస్తుండగా, హిమాచల్ ప్రదేశ్లో ₹400, జార్ఖండ్లో ₹290, తమిళనాడులో ₹240, బీహార్లో ₹196 చొప్పున వేతనం అందుతోంది.

జైళ్లలో ఉత్పత్తులు..
కాగా జైళ్లలో ఖైదీలు కేవలం శిక్ష అనుభవించడమే కాదు, పలు ఉత్పత్తుల తయారీలో కూడా పాల్గొంటున్నారు. ఫర్నిచర్, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు, హస్తకళా వస్తువులు, స్టీల్ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు వంటి పలు వస్తువులను ఖైదీలు తయారు చేస్తున్నారు. వీటి విక్రయం ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం కూడా లభిస్తోంది. ఈ విభాగంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ జైళ్ల ఉత్పత్తుల ద్వారా ఏడాదికి ₹222.69 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ ₹11.11 కోట్ల ఆదాయంతో దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. జైళ్లలో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని జైళ్ల మొత్తం సామర్థ్యం 8,659 మంది ఖైదీలకు మాత్రమే. అయితే 2024 డిసెంబర్ 31 నాటికి జైళ్లలో 7,861 మంది ఖైదీలు ఉన్నారు. మొత్తం సంఖ్య పరిమితిలోనే ఉన్నప్పటికీ, సెంట్రల్ జైళ్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని ఐదు సెంట్రల్ జైళ్ల సామర్థ్యం 3,764 మందికి మాత్రమే ఉండగా, ప్రస్తుతం అక్కడ 4,698 మంది ఖైదీలు ఉన్నారు. అంటే సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం వల్ల రద్దీ తీవ్రస్థాయికి చేరింది. ఇది భద్రత, ఆరోగ్యం, నిర్వహణ పరంగా పెద్ద సవాలుగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
అండర్ ట్రయల్ ఖైదీలే ఎక్కువ
జైళ్లలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఇంకా కోర్టు విచారణ పూర్తికాని అండర్ ట్రయల్ ఖైదీలేనని నివేదిక వెల్లడించింది. మొత్తం ఖైదీల్లో 5,705 మంది అండర్ ట్రయల్స్ కాగా, శిక్ష పడిన ఖైదీలు 2,131 మంది మాత్రమే ఉన్నారు. అంటే విచారణలు ఆలస్యం కావడం వల్ల చాలా మంది సంవత్సరాల తరబడి జైళ్లలోనే ఉండాల్సి వస్తోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. న్యాయ ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఖాళీ పోస్టులతో ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో మొత్తం 2,637 పోస్టులు మంజూరై ఉన్నాయి. అయితే ప్రస్తుతం 797 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జైలు వార్డర్లు, భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది, పరిపాలనా సిబ్బంది కొరత కారణంగా నిర్వహణలో సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. సిబ్బంది కొరత కారణంగా ఖైదీల పర్యవేక్షణ, భద్రత, పునరావాస కార్యక్రమాల అమలు ప్రభావితమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

