Ap Weather Update,పిడుగులు పడి ముగ్గురు మృతి.. మరో మూడు రోజులు పిడుగులతో వానలు.. బీ అలర్ట్.. – weather update apsdma predicts rain with thunder coming 3 days in andhra pradesh
ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వానలు పడనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు మంగళవారం రోజున విజయనగరం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఉరుములతో వానలు పడేటప్పుడు చెట్ల కిందకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైలైట్:
ఏపీలో మరో మూడు రోజులు వానలు
పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
ఏపీలో మరో మూడు రోజులు వానలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వచ్చే మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించారు. మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో బుధవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు. శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పోలవరం జిల్లాలోని చింతూరు మండలాల్లో బుధవారం రోజున వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఎండ తీవ్రత, ఉక్కపోతల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంగళవారం రోజున నంద్యాల జిల్లా బనగానపల్లిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పిడుగులు పడి ముగ్గురు మృతి
మరోవైపు మంగళవారం రోజున విజయనగరం జిల్లా రాజాం మండలంలోని గెడ్డ వలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగు పడి ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు పొలం పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో సత్తెమ్మ, నరసమ్మ, పైల రాము అనే ముగ్గురు మహిళలు దగ్గర్లోని చెట్టుకిందకు పరుగులు తీశారు. చెట్టు కింద ఉన్న సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సత్తెమ్మ,నరసమ్మ తోటి కోడళ్లు. దీంతో అనుకోని రీతిలో ఒకే కుటుంబంలోని ఇద్దరు ఒకే రోజు చనిపోవటం.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది.
రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.
వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి