పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై కొంతమంది ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. గత 80 ఏళ్లుగా ఆకివీడు పెదపేటలో రామాలయం ఉన్నట్లు రికార్డుల్లో ఉందని పేర్కొంది. అన్ని రికార్డులు, ఆధారాలను పరిశీలించిన తర్వాతే రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
హైలైట్:
- ఆకివీడు రామాలయం నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్
- అనుమతులు మంజూరు చేయటంపై సవాల్ చేసిన పిటిషనర్లు
- పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

మరోవైపు ఆకివీడులో రామాలయం అంశం గత కొంతకాలంగా ఏపీలో చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్కడ పర్యటించటం, ఈ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మిస్తామని రఘురామ చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న మరో వర్గం మాత్రం రామాలయం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమకు గొంతెనమ్మ ఆలయాన్ని నిర్మించాలని కోరుతోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం కోర్టుకు చేరగా.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే.. ఆకివీడులో నిర్మాణాలైనా, తొలగింపులైనా చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం నుంచి అన్ని అనుమతులు రావటంతో ఇటీవల రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. రఘురామ దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు.


